దేశం చూపు కేసీఆర్ వైపు..

by Ravi |   ( Updated:2023-01-18 02:09:54.0  )
దేశం చూపు కేసీఆర్ వైపు..
X

తెలంగాణ రాష్ట్ర సాధనలో ఖమ్మం కీలక పాత్ర పోషించినది. కేసీఆర్ ఆమరణ దీక్షకు ఖమ్మం ఊపిరి పోసింది. నేడు దేశం కోసం ఖమ్మంలో కదన భేరి మోగించనుంది. బీఅర్ఎస్ ఆవిర్భావ సభకు సిఎం కేసీఆర్‌తో పాటు కేరళ, ఢిల్లీ, పంజాబ్ సిఎంలు పినరయి, కేజ్రీవాల్, భగవంత్ సింగ్ మన్, యూపీ, ఒడిశా మాజీ సిఎంలు అఖిలేష్ యాదవ్, గామాంగ్, జాతీయ పార్టీల నేతలు ఒకే వేదికపై రావడం దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరగబోతున్నాయని చెప్పడానికి ఖమ్మం బీఆర్ఎస్ సభ నాంది. నాడు కరీంనగర్ తెలంగాణ కోసం కదన రంగం.. నేడు ఖమ్మం గుమ్మం దేశం కోసం అనేలా కేసీఆర్ కీలక అడుగులు పడుతున్నాయి.

కేంద్రంలో బీజేపీ పాలనలో దేశానికి పట్టిన దరిద్రం దుమ్ము దులపాలనే లక్ష్యంతో తెలంగాణ సీఎం కేసీఆర్ నేతృత్వంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అవతరించింది. ఈ జెండా సకల జనులు జెండా. సకల వనరులు, సంపద పంచిపెట్టే జెండా. ఈ జెండా సకల దరిద్రం రూపుమాపే అజెండా. దేశమంతా ఇప్పుడు కేసీఆర్ వైపు చూస్తుంది.

సంక్షేమంలో తెలంగాణ

తెలంగాణ రాష్ట్రం వెలుగునిస్తుంది. దామరచర్ల ప్లాంట్ సిద్ధం అయింది. వచ్చే మార్చి నాటికి 9,450 మెగావాట్ల సామర్థ్యం విద్యుత్ పెరుగుతుంది. వ్యవసాయ రంగంలో సరికొత్త అధ్యాయం రాసుకుంటున్నాము. కోటి ఎకరాలకు పంట సాగు పెరిగింది. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో దేశంలో తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. తెలంగాణలో 2022 నాటికి అన్ని పంటలు కలిపి మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి 3.50 కోట్ల టన్నులకు చేరింది. 2 కోట్ల 3 లక్షల ఎకరాలకు పంటసాగు విస్తరణ పెరిగింది. బియ్యం ఉత్పత్తిలో సైతం 2021లో 1.02 కోట్ల ఉత్పత్తి సాధించి దేశానికి ఆదర్శంగా నిలిచి దేశానికి అన్నం పెడుతోంది. గోడౌన్ల సంఖ్య 68.28 లక్షల టన్నుల సామర్థ్యం కు పెంచుకున్నాము. ఖరీఫ్ సీజన్ లో రైతులు పండించిన ధాన్యాన్ని 7 వేల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. 1 కోటి 7 లక్షల 748 కోట్ల విలువైన 6 కోట్ల 6 లక్షల టన్నుల ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో జమ చేసిన ఘనత తెలంగాణ. 36 వేల కోట్లతో నాణ్యమైన విద్యుత్‌ను వ్యవసాయ రంగానికి ఉచితంగా అందిస్తుంది.

రైతు బంధు పథకం ద్వారా రెండు పంటలకు కలిపి పెట్టుబడి సాయాన్ని 10 వేలు అందిస్తుంది. ఈ యాసంగికి 10 విడత రైతు బంధు నిధులు ఈ నెల 28 నుండి వచ్చే సంక్రాంతి వరకు 7,600 కోట్ల రూపాయలు రైతు ఖాతాలో జమ అవుతుంది. అంటే ఇప్పటి వరకు 65 వేల కోట్ల రూపాయలు రైతు బంధు ద్వారా రైతు ఖాతాల్లో జమ చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కింది. రాష్ట్రం సొంత ఆదాయంలో మనమే నంబర్ వన్ .. 2014లో రూ. 29,288 కోట్లు కాగా ఇప్పుడు 2021-2022 నాటికి 92 వేల 910 కోట్ల రూపాయలకు ఆదాయం పెంచుకున్నము. ఈ సంవత్సరం 90 వేల ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదలై ఉద్యోగాల నియామకం ప్రక్రియ శరవేగంగా జరుగుతుంది. ఇవే కాక వైద్య, విద్య, ఇరిగేషన్, ఆర్ అండ్ బి శాఖల్లో అదనంగా ఉద్యోగాల భర్తీకి కూడా చర్యలు చేపట్టింది.

దేశవ్యాప్తంగా సంచలనంగా మారి

ఉమ్మడి రాష్ట్రంలో పింఛన్ కావాలంటే. చావు కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉండేది. కేసీఆర్ అధికారంలోకి రాగానే ఆసరా పింఛన్ల పథకం ప్రవేశపెట్టి నేడు వితంతులు, వృద్ధులకు రూ.2018, వికలాంగులకు రూ.3018 పింఛన్ అందించి పేదల వారి గుండెల్లో నిలిచిపోయాడు. నేడు పింఛన్ పొందుతున్న వారిని ఎవరిని కదిలించినా వారికి కేసీఆరే గుర్తుకు వస్తారు. కడుపున పుట్టిన పిల్లలు పట్టించుకోకున్నా పింఛన్ పథకంతో పెద్ద కొడుకులా ఆసరా అవుతున్నాడని కేసీఆర్ కడుపు చల్లగా ఉండాలని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి, కుల వృత్తుల వారికి పింఛన్లు ఇవ్వడంతో వారి సంతోషానికి అవధులు లేవు. ఆడ పిల్లల కుటుంబాలకు కొండంత ధైర్యం అందించడానికి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో వారి కుటుంబాలకు కొండంత అండగా మారింది. ఎక్కడా లేని విధంగా ఆడపిల్ల పెళ్లి చేస్తే రూ.100118 ఇవ్వడం వారి కుటుంబాలకు ఎంతో మేలు జరుగడానికి తోడ్పడుతుంది. రేషన్ కార్డుల మీద ఉన్న కుటుంబ సభ్యుల నిబంధనను ఎత్తి వేయడంతో పాటు గతంలో ఒకరికి 4కిలోలు ఇస్తే దాన్ని 8 కిలోలకు చేశారు. దొడ్డు బియ్యం స్థానంలో పేదలకు సైతం సన్నబియ్యం అందిస్తున్నారు. దళితులను అభివృద్ధిలోకి తీసుకురావడానికి కేసీఆర్ తీసుకు వచ్చిన దళిత బంధు పథకం దేశంలోనే పెను సంచలనం సృష్టించింది.

గ్రామ గ్రామాన బీటీ రోడ్డు పనులు, ఇండస్ట్రీ పాలసీ, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, భారీ నీటి ప్రాజెక్టుల నిర్మాణం, వ్యవసాయం కు చేయూత, కుల వృత్తులకు భరోసా, నిరుపేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు, విద్యార్థులకు సన్నబియ్యం, ఆరోగ్య లక్ష్మి, అమ్మ ఒడి, షీటీమ్స్, గొల్ల కుర్మలకు గొర్రెల పంపిణీ, ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్, ఉద్యోగులు, జర్నలిస్టులకు వెల్నెస్ కేంద్రాలు, పోలీస్ సంక్షేమం, అంగన్వాడీ, ఆశా వర్కర్ల జీతాలు పెంపు, ఆర్టీసీకి అండదండలు తదితర పథకాలతో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెం1 రాష్ట్రంగా తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ వ్యాప్తంగా సంచలనం గా మారారు. ఓకే సారి 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుంది. ఇదొక నూతన అధ్యాయం. మెడికల్ కాలేజీలు సంఖ్య 17కు చేరింది. 2023 సంవత్సరానికి మొత్తం 33 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అలాగే కేసీఆర్ కిట్ ద్వారా మాతా శిశు మరణాలు గణనీయంగా తగ్గాయి. అందుకే వచ్చే ఎన్నికల్లో బీజేపీ యేతర పార్టీలన్ని బీఅర్ఎస్ నేతృత్వంలో కలిసే నడిచే అవకాశం ఉంది. ప్రజల ఆశీర్వాదంతో కేసీఆర్ ముందుకు వెళ్తున్నారు.

చిటుకుల మైసారెడ్డి,

సీనియర్ జర్నలిస్ట్,

9490524724

Also Read....

నిలువెత్తు రూపం... నినదించిన గళం...


Advertisement

Next Story

Most Viewed